దీపావళి వేళ అయోధ్యలో ప్రపంచ రికార్డుకు చర్యలు

దీపావళి వేళ అయోధ్యలో ప్రపంచ రికార్డుకు చర్యలు

  • ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి జరుగుతున్న వెలుగుల పండుగ
  • 28 లక్షల దీపాలతో గత రికార్డు బద్దలు కొట్టేందుకు ఏర్పాట్లు

పీపుల్స్‌డైరీ`అయోధ్య : దీపావళి పండగ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో దీపోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో దీపోత్సవానికి అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దీపావళి పండగ రోజున లక్షలాది దీపాలను వెలిగించి.. ప్రపంచ రికార్డును సృష్టించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రతీ సంవత్సరం దీపావళి పండగకు ఒక రోజు ముందు.. అయోధ్యలోని సరయూ నదీ తీరంలో దీపోత్సవ్‌ కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతేడాది 25 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించగా.. ఈ ఏడాది 28 లక్షలతో ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగే దీపోత్సవ్‌ వేడుకలకు అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇందుకోసం సరయూ నదీ తీరంలో ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. సరయూ నది ఒడ్డున ఉన్న మొత్తం 51 ఘాట్‌లలో ఒకేసారి 28 లక్షల దీపాలు వెలిగించేందుకు యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దీపోత్సవం కార్యక్రమంలో 30 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. ఇక అయోధ్యలో ఈ ఏడాది జనవరి 22వ తేదీన నిర్వహించిన రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి జరుగుతున్న దీపావళి పండుగ కావడంతో ఈ దీపోత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహించాలని యోగి ఆదిత్యనాత్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీపావళి, దీపోత్సవం సందర్భంగా అయోధ్య రామమందిరం మొత్తాన్ని పూలు, విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. సరయూ నదికి హారతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరిస్తూ.. దీపాలను లెక్కించనున్నారు. ఈ దీపోత్సవానికి అన్ని శాఖల మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే లేజర్‌ షో కనువిందు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *