అన్నదాతకు శుభవార్త

  • రైతు భరోసాకు రెడీ
  • త్వరలో అన్నదాతల అకౌంట్లలోకి డబ్బులు
  • విధివిధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. దాదాపు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18 వేల కోట్లు జమ చేయగా.. మరో 13 వేల కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు రుణమాఫీ అమలు కావటంతో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయినట్లు తెలిసింది. అందుకు అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం. ముందుగా ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి.. డిసెంబర్‌ నెలఖారు నాటికి పూర్తిగా సాయం అదించాలని నిర్ణయం తీసుకుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంట పెట్టబడి సాయం కోసం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 10 వేలు (ఖరీఫ్‌, రబీ రెండు విడతల్లో) జమ చేశారు. ఇదే పథకాన్ని రైతు భరోసాగా మార్చిన రేవంత్‌ సర్కార్‌.. ఎకరాకు రూ.15 వేలు రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ పథకం అమల్లోకి రాలేదు. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగులో లేని కొండలు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు సైతం రైతుబంధు నిధులు ఇచ్చారని ప్రస్తుత మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కాగా విధి విధానాలు ఖరారు చేసి కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *